Nara Lokesh: జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది రెడ్లే: లోకేశ్

Lokesh held meeting with Reddys

  • కడప జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
  • కడప పుత్తా ఎస్టేట్స్ లో రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులతో లోకేశ్ భేటీ
  • జగన్ పాలనలో నలుగురు రెడ్లే బాగుపడ్డారని విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప గడ్డపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర 118వ రోజు  కడప పుత్తా ఎస్టేట్ నుంచి ప్రారంభం కాగా, యువగళం పాదయాత్ర పొడవునా జనం పోటెత్తారు. లోకేశ్ కు ఆపిల్ పండ్లతో తయారుచేసిన గజమాలను వేసి ఘనంగా సత్కరించారు. 

కాగా, బుధవారం సాయంత్రం కడప రాజరాజేశ్వరి కళ్యాణమండపం ఎదుట ప్రాంగణంలో రాయలసీమ ప్రముఖులతో లోకేశ్ మిషన్ రాయలసీమ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ముఖాముఖి  సమావేశంలో, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో చేపట్టబోయే పనులపై యువనేత లోకేష్ కీలక ప్రకటన చేయనున్నారు. 

జగన్ పాలనలో నలుగురు రెడ్లే బాగుపడ్డారు!

తాను పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఎదురైన సమస్యలు చూశాక జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది రెడ్డి సోదరులేనని తెలిసిందని, జగన్ చేతిలో రెడ్డి సామాజికవర్గం బాధితులుగా మారారని నారా లోకేశ్ పేర్కొన్నారు. 

కడప పుత్తా ఎస్టేట్స్ లో రెడ్డి సామాజికవర్గీయులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... జగన్ పాలనలో కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని, సజ్జల, సాయిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డికి తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదని తెలిపారు. 

"రెడ్డి సోదరులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. జగన్ పాలనలో రెడ్లకు కనీస గౌరవం దక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి గౌరవం ఇచ్చింది. 2014 నుండి 19 వరకూ రెడ్లకు ముఖ్య పదవులు ఇచ్చాం. జగన్ కొన్ని అపోహలు కల్పించాడు. నిజం ఇంటి గడప దాటే ముందు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సోదరులు మోసపోయారు" అని స్పష్టం చేశారు.

జగన్ పాలనలో రెడ్డి సోదరుల ఆత్మహత్యలు

జగన్ పాలనలో రెడ్డి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. "పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్లలో ఉన్న పేదలను ఆదుకుంటాం. రెడ్డి భవనం ఏర్పాటుకు సహకరిస్తాం. పెండింగ్ బిల్లులు అన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు అధైర్య పడొద్దు. తప్పకుండా ఆదుకుంటాం" అని భరోసా ఇచ్చారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యాక్షన్ బాధితులకు సాయం

ఫ్యాక్షన్ లో ఇబ్బంది పడిన కుటుంబాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నామని లోకేశ్ వెల్లడించారు. రెడ్డి కార్పొరేషన్ పెట్టడమే తప్ప జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదని విమర్శించారు. 

"రైతులకు కులం ఉండదు. ఇప్పుడు రైతుల్లో కూడా జగన్ ప్రభుత్వం కులం చూస్తుంది. మోటార్ల మీటర్లు పెట్టి రైతులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీది" అని వివరించారు.

తెలుగుదేశం కుటుంబం... ఆదుకునే అనుబంధం!

ఇటీవల కడప పార్లమెంట్ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి న‌ర‌సింహ చ‌నిపోగా, వారి కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంది.  ఐటీడీపీ రూ.2 లక్షలు, స్థానిక నాయకులు రూ.2 లక్షలు, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు చంద్రబాబు రూ. 5 లక్షలు క‌లిపి మొత్తం రూ.9 ల‌క్ష‌లు సాయంగా అందించారు. నరసింహ భార్యకి ఉద్యోగం, కూతురిని చదివించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో, నరసింహ కుటుంబ సభ్యులు త‌మకి అండ‌గా నిలిచిన నారా లోకేశ్ ని పాద‌యాత్ర‌లో క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను తాము ఎప్పటికీ విస్మరించబోమని, వారి కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని లోకేశ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1516.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 7.4 కి.మీ.*

*119వ రోజు యువగళం వివరాలు (7-6-2023)*

*కడప అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

సాయంత్రం

*5.00 – కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద ప్రాంగణంలో “మిషన్ రాయలసీమ”పై రాయలసీమ ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమం.*

6.30 – కడప రాజరాజేశ్వరి కళ్యాణ మండపం ఎదుట విడిది కేంద్రంలో బస.

******

Nara Lokesh
Reddys
Yuva Galam Padayatra
Kadapa District
TDP
  • Loading...

More Telugu News