Mallu Bhatti Vikramarka: నిన్ను కలుపుతాం బంగాళాఖాతంలో!: కేసీఆర్ కు భట్టి కౌంటర్

Bhatti counters KCR comments

  • నిన్న నిర్మల్ సభలో కాంగ్రెస్ ను విమర్శించిన కేసీఆర్
  • తమను విమర్శించే కాంగ్రెస్ నేతలే బంగాళాఖాతంలో కలుస్తారంటూ శాపనార్థాలు
  • నీలాంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ వందలమందిని చూసిందన్న భట్టి
  • మూడు చెరువుల నీళ్లు తాగిస్తామంటూ కేసీఆర్ కు వార్నింగ్
  • కాంగ్రెస్ ముందు నువ్వెంత, నీ కొడుకెంత, నీ అల్లుడెంత? అంటూ వ్యాఖ్యలు

నిర్మల్ లో నిన్న జరిగిన సభలో సీఎం కేసీఆర్ కేవలం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలపాలంటున్న కాంగ్రెస్ నేతలే బంగాళాఖాతంలో కలిసిపోతారని దుమ్మెత్తిపోశారు. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. 

కేసీఆర్... నీలాంటి వాళ్లను వందల మందిని చూశాం... ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి నిన్నే బంగాళాఖాతంలో ముంచుతాం... ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం నీ వల్ల కాదు కదా... నీ తాత వల్ల కూడా కాదు అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ శ్రేణులు కలసికట్టుగా కదం తొక్కితే, అడుగుల శబ్దానికే చస్తారు మీరు... కలుగులోంచి బయటికి వచ్చిన ఎలుకలా, ఫాంహౌస్ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు నువ్వెంత, నీ కొడుకెంత, నీ అల్లుడెంత? అంటూ భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేం కాదు... దొరల సర్కారును బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు... ఈ సంగతి కేసీఆర్ గ్రహించాలి అని పేర్కొన్నారు. 

పోలీసు రాజ్యంలో బిక్కుబిక్కుమంటున్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరో 4 నెలల్లో విముక్తి కలిగిస్తుందని అన్నారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది... ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు అని భట్టి స్పష్టం చేశారు.

Mallu Bhatti Vikramarka
KCR
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News