Bandi Sanjay: ఎన్నికల ముందే కేసీఆర్ కు మహనీయులు గుర్తొస్తారు: బండి సంజయ్

Bandi Sanjay take a swipe at CM KCR

  • నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
  • కేసీఆర్ తొలిసారి అంబేద్కర్ జయంతి వేడుకకు హాజరయ్యారన్న సంజయ్
  • ఈ నెల 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్
  • హైదరాబాదులో భారీ స్థాయిలో మిలియన్ మార్చ్ 

ఇటీవల తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కాగా, తనను అరెస్ట్ చేయడం, అంతకుముందు టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా తప్పుల తడకేనని విమర్శించారు. నిరుద్యోగులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని అన్నారు. 

కేసీఆర్ ఏర్పాటు చేసిన సిట్ లు ఏ కేసునూ తేల్చలేదని తెలిపారు. అవినీతి, తప్పుల నుంచి చేతులు దులుపుకునేందుకే సిట్ ఏర్పాటు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నామనే, తమపై టెన్త్ పేపర్ లీక్ ఆరోపణలు చేశారని వివరించారు. 

ప్రశ్నిస్తారన్న కారణంతోనే పేదలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. 

మళ్లీ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే కేసీఆర్ కు మహనీయులు గుర్తొస్తారని బండి సంజయ్ విమర్శించారు. గత ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇంతవరకు పీవీ పేరెత్తలేదని ఆరోపించారు. కేసీఆర్ తొలిసారి నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. 

ఈ నెల 21 పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News