Vande Bharat: హైదరాబాద్ నుంచి మూడో వందేభారత్ రైలు...?

Is there another Vande Bharat train from Hyderabad
  • సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు
  • తొలి వందేభారత్ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య పరుగులు
  • ఈ నెల 8న రెండో వందేభారత్ రైలు (సికింద్రాబాద్-తిరుపతి) ప్రారంభం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రైలు అంటూ వార్తలు
ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, కేంద్రం మూడో వందేభారత్ రైలుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన కేంద్రం, ఈ నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ ను పట్టాలెక్కించింది. 

ఈ క్రమంలో, హైదరాబాదు నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలు నడిపే ఆలోచన ఉన్నట్టు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ స్థానిక బీజేపీ నేతలతో అన్నట్టు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే భాగ్యనగరం నుంచి మూడు వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నట్టవుతుంది. 

ఇప్పటికే హైదరాబాద్-బెంగళూరు మధ్య పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. 570 కిమీ దూరాన్ని అవి 11 గంటల వ్యవధిలో పూర్తి చేస్తున్నాయి. అదే వందేభారత్ రైలు అయితే 7 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. 

కాగా, ఈ రైలును కాచిగూడ నుంచి నడుపుతారని గత జనవరిలోనే వార్తలు వినిపించాయి. అంతేకాదు, సికింద్రాబాద్ నుంచి పూణే నగరానికి వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు నడిపే అవకాశాలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Vande Bharat
Express
Hyderabad
Bengaluru

More Telugu News