Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు తీరు చూస్తే ఇక గవర్నర్ ను కలవడం ఒకటే తక్కువ అన్నట్టుగా ఉంది: సజ్జల

Sajjala satires on Chandrababu

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జయభేరి
  • ఈ మాత్రానికేనా అంటూ సజ్జల విమర్శలు
  • చంద్రబాబు తీరు చూస్తే నవ్వొస్తోందని వెల్లడి
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తీరు సరికాదని వ్యాఖ్యలు

మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినందుకే టీడీపీ నేతలు పొంగిపోతున్నారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు హడావుడి చూస్తుంటే నవ్వొస్తోందని, గవర్నర్ ను కలవడం ఒక్కటే తక్కువ అన్నట్టుందని ఎద్దేవా చేశారు.

రాజీనామా చేయాలని మమ్మల్ని అంటున్నారు... చంద్రబాబే రాజీనామా చేయొచ్చు కదా...! అని వ్యాఖ్యానించారు. 175 స్థానాల్లో పోటీ పెట్టే ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తీరు సరికాదని సజ్జల ఆక్షేపించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కొందరు అధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఒక్క బండిల్ చూస్తేనే ఆరు ఓట్లు తేడాగా కనిపించాయని, అన్ని బండిల్స్ పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారని, రీకౌంటింగ్ కోరడం అభ్యర్థి హక్కు అని స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదని సజ్జల విమర్శించారు. అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు తహతహలాడుతున్నారని వ్యాఖ్యానించారు.

అటు, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు దొరను పోలిన దొంగ అని అభివర్ణించారు. లేని కంపెనీలు సృష్టించడం తీవ్రమైన నేరం అని, స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. నాడు వోక్స్ వాగన్ కేసులో తామే సీబీఐ విచారణ కోరామని, స్కాంలో ఉన్నారు కాబట్టే టీడీపీ నేతలు నోరు మెదపడంలేదని బొత్స విమర్శించారు.

Sajjala Ramakrishna Reddy
Chandrababu
MLC Elections
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News