Adani Enterprises: హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
![BRS gives suspension of business notice in both Houses of Parliament to discuss Hindenburg report](https://imgd.ap7am.com/thumbnail/cr-20230202tn63db4ab070317.jpg)
- రాజ్యసభలో తీర్మానం ఇచ్చిన ఎంపీ కేశవరావు
- లోక్ సభలో స్పీకర్ కు తీర్మానం అందజేసిన నామా
- అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై చర్చించాలంటున్న ఆప్, కాంగ్రెస్
అదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక భారత స్టార్ మార్కెట్లను షేక్ చేస్తోంది. అదానీ కంపెనీ అనేక అవకతవకలకు పాల్పడిందని హిండెన్ బర్గ్ తన నివేదికలో పేర్కొనడంతో ఆ కంపెనీ షెర్లన్నీ పతనం అయ్యాయి. నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ గ్రూప్ ప్రతీ రోజు వేల కోట్ల రూపాయలు కోల్పోతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ పైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపెడుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ అంశం పార్లమెంట్ ను కూడా తాకింది.
ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ కేశవరావు ఈ రోజు రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ ప్రజలు, దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో ఆ నివేదిక ఉన్నట్లు తీర్మానంలో ప్రస్తావించారు. దీనిపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరారు. మరోవైపు లోక్సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అదానీ గ్రూపు ఆర్ధిక అవకతవకలపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.