Andhra Pradesh: ఏపీ మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో సీఐడీ సోదాలు

TDP Leader Narayana Office Searched by AP CID

  • హైదరాబాద్‌లోని కార్యాలయంలో దాదాపు 40 మంది అధికారుల సోదాలు
  • అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు
  • హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్ల స్వాధీనం

టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ కార్యాలయంలో నిన్న ఏపీ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మిలాంజ్ టవర్స్ పదో అంతస్తులో ఉన్న ఆయన కార్యాలయానికి ఉదయం 10 గంటల సమయంలో దాదాపు 40 మంది అధికారులు చేరుకున్నారు. అనంతరం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ రాజధాని అమరాతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2020లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఆయనను ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నారాయణ నిన్న వారి కోసం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎదురుచూస్తుండగా, అధికారులు కార్యాలయానికి వెళ్లి సోదాలు చేశారు. సమాచారం అందుకున్న నారాయణ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆయనను ప్రశ్నించిన అధికారులు సాయంత్రం 5 గంటల తర్వాత పంపించి వేశారు. కాగా, నారాయణ సంస్థల్లో సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి.

Andhra Pradesh
P Narayana
AP CID
Telugudesam
  • Loading...

More Telugu News