Jagan: చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనను: కమలాపురం సభలో సీఎం జగన్

CM Jagan slams opposition leaders

  • కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నివాసం.. అంటూ స్పష్టీకరణ  
  •  వాళ్ల మాదిరిగా దత్తపుత్రుడిని నమ్ముకోలేదని వ్యాఖ్య  

ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కమలాపురం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనో, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అనో తాను అనడంలేదని తెలిపారు. 'చంద్రబాబు పార్టీతో కలిసున్న దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా నేను అనడంలేదు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

"ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడ ఉన్న ఐదు కోట్ల మంది నా కుటుంబం, ఇక్కడే నా రాజకీయం, ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం... తేడా గమనించమని కోరుతున్నా. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెబుతుండేవాడ్ని. నాయకుడు అనేవాడికి విశ్వసనీయత ఉండాలని చెప్పేవాడ్ని. కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి" అని స్పష్టం చేశారు. 

అంతేకాదు, మరో 16 నెలల్లోనో మరో 18 నెలల్లోనో ఎన్నికలు వస్తున్నాయని, ఆ ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, ఆ దేవుడిని తప్ప మరొకరిని కాదు అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. "వాళ్ల మాదిరిగా నేను ఎల్లో మీడియాను నమ్ముకోలేదు, వాళ్ల మాదిరిగా నేను దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. చేసిన మంచిని, దేవుడ్ని, మిమ్మల్ని నమ్ముకున్నాం. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం. మంచి చేస్తే... చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి ఉంటాం. నేను అదే కోరుకుంటాను" అని వివరించారు. 

అంతకుముందు, వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టులు నిలిచిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిందని, రూ,6,914 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రూ.550 కోట్లతో బ్రహ్మం సాగర్ లైనింగ్ పనులు చేపట్టామని, తాము వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయగలిగామని సీఎం జగన్ వెల్లడించారు. 

జిల్లాలో 550 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇవి పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి రైల్వే లైన్ కోసం రూ.68 కోట్లు ఖర్చుచేస్తున్నామని అన్నారు. 

ఇక దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న రూ.13.60 కోట్ల చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను విడుదల చేసి ఇక్కడికి వచ్చానని సీఎం జగన్ వెల్లడించారు.

Jagan
Chandrababu
Pawan Kalyan
YSRCP
TDP
Janasena
Kamalapuram
Kadapa District
  • Loading...

More Telugu News