Heavy Rains: ఏపీ దక్షిణ కోస్తాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు

Heavy rains lashes AP South Coastal districts

  • తీరం దాటినా ప్రభావం చూపుతున్న మాండూస్
  • బలహీనపడి వాయుగుండంగా మారిన వైనం
  • ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
  • పంట పొలాల్లో నీరు
  • కూలిన విద్యుత్ స్తంభాలు

మాండూస్ తుపాను తీరం దాటిన తర్వాత అత్యధిక ప్రభావం చూపిస్తోంది. మాండూస్ భూభాగంపై ప్రవేశించి వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, ఏపీ దక్షిణ కోస్తాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రకాశం జిల్లాలో నేడు విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

జిల్లాలోని పీసీ పల్లి మండలంలో ఈ ఉదయానికి 148 మిమీ వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొండేపి, కనిగిరి, ఎస్ఎన్ పాడు నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. విఠలాపురం వద్ద దోర్నపు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 

పెద్దారవీడు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో మిర్చి, మినుము, కంది పొలాల్లో భారీగా వర్షపునీరు చేరింది. దర్శి ప్రాంతంలో భారీ వర్షాలకు వరి పంట దెబ్బతింది. ఒంగోలు, సంతనూతలపాడు, కొండేపి ప్రాంతాల్లో పొగాకు, శనగ పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. 

అటు, మాండూస్ ప్రభావంతో తిరుపతి జిల్లాలోనూ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు నేలకొరిగాయి. 14 సబ్ స్టేషన్ల పరిధిలో సమస్యలను గుర్తించిన అధికారులు తగిన చర్యలు తీసుకుని విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.

తిరుమల కొండపైనా భారీ వర్షాలు కురవడంతో జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పాపనాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్ లలో గరిష్ఠ నీటిమట్టం నమోదైంది. పాపనాశనం డ్యామ్ లో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాంతో మామండూరు పరిసర ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. 

భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల కొండపైకి ద్విచక్ర వాహనాలను టీటీడీ అధికారులు అనుమతించడంలేదు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, పాపనాశనం, జపాలి తీర్థం, ఆకాశ గంగ, శ్రీవారి పాదాలు ప్రాంతాలకు కూడా వాహనాలను అనుమతించడంలేదు.

Heavy Rains
South Coastal AP
Mandous
Andhra Pradesh
  • Loading...

More Telugu News