Nizamabad District: ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఇల్లొదిలి వెళ్లిన వివాహిత.. అతడి చేతిలోనే దారుణ హత్య

UP Facebook Friend Killed Telangana Woman

  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం యూపీ వెళ్లిన నిజామాబాద్ మహిళ
  • పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో కొట్టి చంపేసిన నిందితుడు
  • ఆపై కంపెనీలోని ఓ ఆవరణలో మృతదేహాన్ని పడేసిన వైనం 

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఇల్లు వదిలి వెళ్లిన వివాహత అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరగ్గా బాధితురాలిది తెలంగాణలోని నిజామాబాద్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని అమ్రోహా జిల్లా గజరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్‌మేట్ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల క్రితం ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమె గురించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు తొలుత కంపెనీ ఉద్యోగులను విచారించారు. ఈ క్రమంలో కంపెనీ తాళంచెవి ఒకటి షెహజాద్ అనే యువకుడి వద్ద ఉంటుందని తెలిసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం (32)కు షెహజాద్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 6న అతడిని కలిసేందుకు ఉస్మా బేగం గజరౌలా చేరుకుంది. షెహజాద్‌ను కలిసి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని షెహజాద్ ఆగ్రహంతో ఆమెను దుపట్టాతో కట్టేసి ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కంపెనీ ఆవరణలో ఓ మూలన ఆమె మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.

మరోవైపు, భార్య అదృశ్యం కావడంతో ఉస్మా బేగం భర్త ముఖీద్ ఈ నెల 6న బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టిన పోలీసులకు యూపీలో ఉస్మా బేగం హత్యకు గురైనట్టు వార్త అందింది. బాన్సువాడకు చెందిన ముఖీద్‌కు 12 సంవత్సరాల క్రితం ఉస్మాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఉస్మా రెండు నెలలపాటు నిజామాబాద్‌లో ఉంది. ఆ తర్వాత పెద్దలు రాజీ కుదర్చడంతో ఈ నెల 4న తిరిగి బాన్సువాడ చేరుకుంది. ఆ తర్వాత రెండు రోజులకే ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం యూపీ వెళ్లి హత్యకు గురైంది.

Nizamabad District
Banswada
Facebook Friend
Crime News
  • Loading...

More Telugu News