Uddhav Thackeray: అంధేరి ఈస్ట్లో ‘నోటా’కు రెండో స్థానం
![Team Thackeray Wins Andheri Election As Expected](https://imgd.ap7am.com/thumbnail/cr-20221107tn636859b387d0a.jpg)
- ఉద్ధవ్ థాకరే శివసేన నుంచి పోటీ చేసిన రుతుజ లట్కే విజయం
- రుతుజకు 66,530 ఓట్లు, నోటాకు 12,806 ఓట్లు
- కొత్త గుర్తు కాగడాపై ఉద్ధవ్ శివసేనకు తొలి విజయం
ముంబైలోని అంధేరి ఈస్ట్కు జరిగిన ఉప ఎన్నికలో విచిత్రం జరిగింది. అక్కడ శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మరణించడంతో ఆయన భార్య రుతుజ లట్కే.. ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన నుంచి పోటీ చేసి, విజయం సాధించగా, రెండో స్థానంలో ‘నోటా’ నిలిచింది. మొత్తం 86,570 ఓట్లలో రుతుజకు 66,530 ఓట్లు రాగా, నోటాకు ఏకంగా 12,806 ఓట్లు పడ్డాయి. అంటే 14.79 శాతం ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న మిగతా వారిలో ఎవరికీ 1600కు మించి ఓట్లు రాకపోవడం గమనార్హం.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలిపోయింది. ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి రుతుజ బరిలో నిలవగా బీజేపీ, ఏక్నాథ్ షిండే వర్గం తమ అభ్యర్థిని ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా రుతుజకే మద్దతు ఇవ్వడంతో పోటీ ఏకపక్షం అయింది. కాగా, ఉద్ధవ్ థాకరే శివసేనకు ఎన్నికల కమిషన్ ‘కాగడా’ గుర్తు కేటాయించింది. ఆ గుర్తుతో బరిలోకి దిగిన ఉద్ధవ్ థాకరే శివసేన తొలి పోరులోనే విజయం సాధించింది.