Necrotizing Bacteria: శరీరంలోని మాంసాన్ని తినేసే బ్యాక్టీరియా.... కోల్ కతాలో వ్యక్తి మృతి

  • ఇటీవల రైలు నుంచి పడిపోయిన వ్యక్తి
  • స్థానిక ఆసుపత్రిలో చికిత్స
  • ఎంతకీ నయంకాకపోవడంతో మెడికల్ కాలేజీకి తరలింపు
  • ప్రాణాంతక బ్యాక్టీరియా బారినపడినట్టు నిర్ధారణ

శరీరంలోని మాంసాన్ని తినేసే ఓ ప్రమాదకర బ్యాక్టీరియా బారినపడి కోల్ కతాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ 44 ఏళ్ల మృణ్మయ్ రాయ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ బ్యాక్టీరియాను నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అని పిలుస్తారని డాక్టర్లు వెల్లడించారు. ఇది అత్యంత ప్రాణాంతక నెక్రోసిస్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తెలిపారు. చర్మం కింది కణజాలంలో వ్యాపించే ఈ మాంస భక్షక బ్యాక్టీరియా ఎంతో అరుదైనదని వివరించారు. ఇది ఎంతో వేగంగా వ్యాపిస్తుందని, సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణహాని తప్పదని వెల్లడించారు. 

మృణ్మయ్ రాయ్ మధ్యమ్ గ్రామ్ ప్రాంతానికి చెందినవాడు. ఇటీవల రైలులో ప్రయాణిస్తూ బోగీ నుంచి పడిపోయాడు. నడుం కింది భాగంలో అతడికి ఓ రాడ్ గుచ్చుకుంది. ఓ వారం పాటు స్థానిక నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆర్జీ కర్ మెడికల్ కాలేజి ఆసుపత్రికి తరలించారు. 

ట్రామా కేర్ యూనిట్ లో అతడికి చికిత్స అందించగా, పరిస్థితి మరింతగా విషమించింది. అతడి తీవ్ర అనారోగ్యానికి కారణం ఏంటన్నది వైద్య పరీక్షల్లో వెల్లడైంది. అతడు ప్రాణాంతక నెక్రోటైజింగ్ ఫాసిటిస్ బారినపడినట్టు నిర్ధారణ అయింది. అప్పటికే ఆ మాంసాహార బ్యాక్టీరియా అతడి జననావయవాల లోపలి భాగాలను తినేసినట్టు గుర్తించారు. ఇతర శరీర భాగాల కణజాలం కూడా నెక్రోసిస్ కు గురికావడంతో తాము ఏమీ చేయలేకపోయామని వైద్యులు తెలిపారు. 

నెక్రోటైజింగ్ ఫాసిటిస్ బ్యాక్టీరియా మొదట రక్తనాళాలపై దాడి చేసి థ్రాంబోసిస్ (నాళాల్లో గడ్డలు) కలిగిస్తుందని మెడికల్ కాలేజి ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ వెల్లడించారు. కండరాలకు, కణజాలాలకు క్రమేపీ రక్త సరఫరాను తగ్గించి, చివరికి ఏమాత్రం రక్తం అందకుండా చేస్తుందని వివరించారు. 

కాగా, మృణ్మయ్ రాయ్ మద్యపానానికి బానిస అవడం వల్ల అతడిలో వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని, అందుకే అతడు నెక్రోసిస్ కు త్వరగా బలయ్యాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Necrotizing Bacteria
Necrosis
Flesh Eating Bacteria
Kolkata
Necrotizing Faciitis
  • Loading...

More Telugu News