Chiranjeevi: మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం!

Chiranjeevi comic moments in an event

  • ఇటీవల గరికిపాటి, చిరు మధ్య ఘటన 
  • అలయ్ బలయ్ లో చిరుతో ఫొటోలకు ఫ్యాన్స్ ఉత్సాహం
  • అసహనానికి గురైన గరికపాటి
  • తాజాగా చిరంజీవి సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్

ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవడం, ఆయన ఫ్యాన్స్ తో ఫొటోలు దిగడం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు కోపం తెప్పించడం తెలిసిందే. ఈ ఘటన ఓ వివాదం రూపుదాల్చింది. గరికపాటి క్షమాపణలు చెప్పినట్టు వార్తలు రాగా, చిరంజీవి కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని పిలుపునివ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది. 

అయితే, నిన్న చిరంజీవి ఓ ఈవెంట్ కు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు చిరంజీవితో ఫొటోల కోసం పోటీలు పడ్డారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు. 

అనంతరం, వారు "లేరు" అని చెప్పడంతో, చిరంజీవి ఛాతీపై చేయి వేసుకుని "హమ్మయ్య" అంటూ రిలీఫ్ గా ఫీలవుతున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. "ఇక రండమ్మా" అంటూ అక్కడున్న మహిళలను ఫొటోలకు ఆహ్వానించారు. 
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఈ వ్యాఖ్య గరికపాటిని ఉద్దేశించే చేసి ఉంటారని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు.

More Telugu News