TTD: అక్టోబర్​ 11 నుంచి హైదరాబాద్​ ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD EO press meet about Srivari Vaibhavotsams

  • ఇక ముందు తిరుమల గదుల బుకింగ్ తిరుపతిలోనే చేసే ఏర్పాటు
  • త్వరలో టైమ్ స్లాట్ టోకెన్లతో దర్శనాల విధానం అమలు చేస్తామని వెల్లడి
  • భక్తుల రద్దీ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వివరణ

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి వారి వైభవోత్సవాలను ప్రారంభించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని.. 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం శ్రీనివాస కల్యాణం జరుగుతాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉత్సవాలు
తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామికి జరిగే సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు. డిసెంబర్ లో ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక కార్తీక మాసంలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ నెలలోనే అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఇక తిరుపతిలోనే గదుల కేటాయింపులు
భక్తుల రద్దీ, ఇబ్బందుల నేపథ్యంలో తిరుమలలోని గదుల కేటాయింపు కూడా కొండ కింద తిరుపతిలోనే చేపట్టనున్నట్టు ధర్మారెడ్డి తెలిపారు. దీనిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు.. తిరుపతిలోనే గది తీసుకుని ఉండేందుకు వీలుంటుందన్నారు. ఇక భక్తులకు నిర్ణీత సమయానికి దర్శనం కల్పించే టైమ్‌ స్లాట్‌ టోకెన్ల విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆ టోకెన్లు తీసుకునే భక్తులు తిరుపతిలోనే బస చేసి.. నిర్ణీత సమయానికి తిరుమలకు వస్తే సరిపోతుందని వివరించారు.

  • Loading...

More Telugu News