Mallikarjuna Kharge: కాంగ్రెస్​ అధ్యక్షుడిగా గెలిచేది ఖర్గేనే.. పోటీ నుంచి తప్పుకున్న అశోక్​ గెహ్లాట్​ వ్యాఖ్య

it will one sided contest for kharge says gehlot
  • పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం మల్లికార్జున ఖర్గేకు ఉందని వ్యాఖ్య
  • శశిథరూర్ ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తిగా అభివర్ణణ
  • అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లికార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలరని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేందుకు ప్రయత్నించి, పలు పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గిన గెహ్లాట్.. ఈ ఎన్నికకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధిస్తారని పేర్కొన్నారు.

శశిథరూర్ ఉన్నత వర్గానికి చెందడంతో..
మల్లికార్జున ఖర్గే దళిత వర్గం నుంచి వచ్చిన నేత అని.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ చెప్పారు. అయితే శశిథరూర్‌ మంచి వ్యక్తి అని, ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయని.. కానీ ఆయన ఉన్నత వర్గానికి చెందినవారు అని పేర్కొన్నారు. అందువల్ల క్షేత్రస్థాయిలో మల్లికార్జున ఖర్గేకు మద్దతు ఉందని.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం కూడా ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు. సహజంగానే  పోటీ ఖర్గే వైపు ఏకపక్షంగా సాగుతుందని పేర్కొన్నారు.

అక్టోబర్ 17న ఎన్నికలు
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి పోటీలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌ ఇద్దరే ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8వ తేదీ వరకు సమయం ఉంది. ఆలోగా ఎవరూ ఉపసంహరించుకోకుంటే.. 17వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది.

Mallikarjuna Kharge
Ashok Gehlot
Congress
Elections
National
Political

More Telugu News