Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 114 క‌రోనా కేసుల న‌మోదు

114 new corona cases registered in telangana

  • హైద‌రాబాద్‌లో 48 కేసుల న‌మోదు
  • క‌రోనా నుంచి కోలుకున్న వారు 130 మంది
  • ఇంకా చికిత్స పొందుతున్న వారి సంఖ్య 792

తెలంగాణ‌లో గురువారం కొత్త‌గా 114 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డ‌చిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రవ్యాప్తంగా 10,804 క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా... 114 కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసుల‌తో తెలంగాణ‌లో ఇప్ప‌టిదాకా మొత్తంగా 8,36,411 క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్టయింది. ఇంకా 366 మందికి సంబంధించిన వైద్య ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. 

ఒక్క హైద‌రాబాద్ ప‌రిధిలోనే 48 కేసులు న‌మోదు కాగా... కేసులు న‌మోదైన మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే న‌మోద‌య్యాయి. హైద‌రాబాద్‌లో రోజుకో కేసు చొప్పున క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం 50 కేసులు న‌మోదు కాగా.. బుధ‌వారం 49 కేసులు న‌మోద‌య్యాయి. గురువారం మ‌రో కేసు త‌గ్గి 48 కేసులే న‌మోద‌య్యాయి.

గురువారం క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఒక్క మ‌ర‌ణ‌మూ సంభ‌వించ‌లేదు. వెర‌సి క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన వారి సంఖ్య‌(4,111)లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. గురువారం క‌రోనా బారిన ప‌డిన వారిలో 130 మంది వైర‌స్ నుంచి విముక్తి పొందారు. దీంతో ఇప్ప‌టిదాకా క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారి సంఖ్య‌ 8,31,508కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 792 మంది క‌రోనా చికిత్స‌ తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News