Spicy foods: స్పైసీ ఫుడ్ ఇష్టపడేవారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే అసిడిటీ నుంచి బయటపడొచ్చని చెబుతున్న నిపుణులు!

Experts say that those who like spicy foods can get rid of acidity if they take these precautions

  • వాస్తవంగా మసాలాలతో శరీరానికి చాలా మేలు ఉంటుందన్న నిపుణులు
  • అసిడిటీ, అజీర్తి భయంతో వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని వెల్లడి
  • పెరుగు వంటివి వాడటం, మిరపకాయలకు బదులు మిరియాలు వాడటం మంచిదని సూచన

చాలా మంది స్పైసీగా ఉండే ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. బిర్యానీ మొదలు మసాలా కర్రీల వరకు స్పైసీగా ఉండే ఫుడ్‌ ఎక్కువగా లాగించేస్తుంటారు. దీనివల్ల అసిడిటీ, ఛాతీలో మంట, అజీర్తి వంటి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నిజానికి మనదేశంలో వంటల్లో వాడే మసాలాల్లో శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మసాలా, స్పైసీ ఫుడ్‌ ను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటివల్ల తలెత్తే ఇబ్బందులను తగ్గించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. మసాలా, స్పైసీ ఫుడ్ తీసుకుంటూనే.. ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేస్తున్నారు.

ప్రోబయాటిక్‌ ఫుడ్‌ తినండి
పెరుగు వంటి ప్రోబయాటిక్‌ ఆహారం మసాలా దినుసుల ఘాటును తగ్గించేందుకు, ఆహారం త్వరగా జీర్ణమవడానికి తోడ్పడుతుంది. అందువల్ల స్పైసీ ఫుడ్‌ తిన్న తర్వాత పెరుగును తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పెరుగును విడిగా మజ్జిగ రూపంలో అయినా, ఆహారంలో కలుపుకొనే రైతా రూపంలో అయినా తీసుకోవచ్చని వివరిస్తున్నారు. ఇంట్లో వండుకునేటప్పుడు మసాలాలతో పాటు కాస్త పెరుగును కూడా జోడించి వండుకోవడం వల్ల మసాలాల రుచి వచ్చినా.. దాని ఘాటుతో ఇబ్బంది కొంత తగ్గుతుందని పేర్కొంటున్నారు.

అతి మధురం (లికోరైస్‌) వేర్లతో టీ
మెరుగైన జీర్ణ శక్తికి, అసిడిటీ సమస్యకు లికోరైస్‌ (అతిమధురం) అత్యంత అద్భుతమైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మసాలా, స్పైసీ ఫుడ్‌ తీసుకున్న తర్వాత లికోరైస్‌ టీ తీసుకోవడం వల్ల అజీర్తి, ఛాతీలో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం తగ్గుతుందని వివరిస్తున్నారు. రెండు కప్పుల నీళ్లలో ఒక అంగుళం లికోరైస్‌ వేరు ముక్కను వేసి.. ఆ నీళ్లు ఒక కప్పు అయ్యేదాకా మరిగించాలని చెబుతున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత ఈ లికోరైస్‌ టీని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలని సూచిస్తున్నారు.

తియ్యగా మొదలుపెట్టి.. చల్లగా ముగించండి
ఆహారం తీసుకునే విధానంలో ఓ మార్పు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా సాధారణమైన, కాస్త తీపి ఉండే ఆహారంతో మొదలుపెట్టి, తర్వాత కాస్త ఉప్పగా ఉండేవి తీసుకోవాలని.. ఆ తర్వాత మసాలా, స్పైసీ ఫుడ్‌ తినాలని చెబుతున్నారు. చివరగా కాస్త చల్లగా ఉండే మజ్జిగగానీ, ఇంకేవైనా పదార్థాలుగానీ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల అసిడిటీ, ఛాతీలో మంట సమస్య తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు.

మిరపకాయలకు బదులు మిరియాలు వాడండి
ఎండు మిరపకాయలైనా, పచ్చి మిరపకాయలైనా సరే జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతాయని.. అసిడిటీ, మంట వంటివాటికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా మిరియాలు, వెల్లుల్లి, ఇంగువ వాడాలని సూచిస్తున్నారు. వీటితో ఆహారానికి కారం, రుచి వస్తూనే.. జీర్ణ వ్యవస్థపై పెద్దగా భారం పడకుండా ఉంటుందని వివరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆహారం ఏదైనా మరీ ఎక్కువ స్పైసీగా, కారంగా ఉండటం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక స్థాయి వరకు మసాలాలు మంచివేగానీ.. అతి అయితే మాత్రం ఇబ్బంది వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇక జీర్ణాశయం, పేగులు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు స్పైసీ ఫుడ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాంటి వారు వైద్యులను సంప్రదించి తగిన డైట్‌ ను అనుసరించాలని వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News