New Delhi: భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్న సహోద్యోగులు.. ముగ్గుర్ని కాల్చి చంపిన పోలీసు

Police Killed colleagues for their Comments against his wife

  • ఢిల్లీలో ఘటన
  • కాల్పుల అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు
  • మృతులను సిక్కిం పోలీసు విభాగానికి చెందిన వారిగా గుర్తింపు

తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ పోలీసు తన సహచరులు ముగ్గురిని కాల్చి చంపాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. తర్వాత నిందితుడు ప్రబీణ్ రాయ్ (32) నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చనిపోయిన వారిని సిక్కిం పోలీసు విభాగానికి చెందిన వారిగా గుర్తించారు. ఇండియన్ రిజర్వు బెటాలియన్‌లో భాగమైన వీరందరూ ఢిల్లీలోని హైదర్‌పూర్ ప్లాంట్ వద్ద భద్రతాపరమైన విధులు నిర్వర్తిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ప్రబీణ్‌రాయ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కొన ఊపిరితో ఉన్న మరొకరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మానసిక వేధింపులకు గురిచేయడం వల్లే తాను వారిని కాల్చేసినట్టు నిందితుడు ప్రబీణ్ రాయ్ ప్రాథమిక విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News