Telangana: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు.. నేడు, రేపు కూడా భారీ వర్షాలు

Heavy Rains Lashed in Telangana

  • ముధోల్ జిల్లాలో రికార్డు స్థాయిలో 20.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • పదేళ్ల తర్వాత ఇదే రికార్డు
  • పొంగుతున్న వాగులు, వంకలు
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకరి మృతి
  • పలు చోట్ల కోతకు గురైన రోడ్లు
  • మరో మూడు రోజుల్లో మరో ఉపరితల ఆవర్తనం

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో నిన్న ఒక్క రోజే 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడది తుడుచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. 

భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగడంతో భైంసా-బాసర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పలుచోట్ల రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. ముస్తాబాద్ మండలం మామిడపల్లికి చెందిన రవి చేపలు  పట్టేందుకు వెళ్లి మరణించాడు. మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం లేదంటే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా మారాయి. కొన్ని జిల్లాల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయి. రానున్న అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Telangana
Heavy Rains
Rajanna Sircilla District
Mudhole
  • Loading...

More Telugu News