Ireland: ఐర్లాండ్‌తో తొలి టీ20: భారత్ అలవోక విజయం

Hooda and Pandya power Indias winning start

  • వర్షం కారణంగా 2.20 గంటల ఆలస్యంగా మ్యాచ్
  • 12 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
  • 109 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలోనే ఛేదించిన భారత్

రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు వరుణుడు తొలుత ఆటంకం కలిగించాడు. భారత కాలమానం ప్రకారం గత రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా 2.20 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. 

ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. 

ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, జోషువా లిటిల్ ఒక వికెట్ తీసుకున్నారు. యుజ్వేంద్ర చాహల్‌కు ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది.

Ireland
India
T20
Hardik Pandya
Yuzvendra Chahal
  • Loading...

More Telugu News