Telangana: రెండు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ

Revanth Open Letter To Telangana CM On These Two Important Issues

  • జయశంకర్ సార్ స్వగ్రామం అభివృద్ధికి నోచుకోవట్లేదని ఆవేదన
  • అక్కంపల్లిలో కనీసం తాగునీటి వసతి లేదని ఆగ్రహం
  • మిషన్ భగీరథ అందట్లేదని లేఖలో వెల్లడి
  • వరంగల్ ఓఆర్ఆర్ పై ఆగ్రహం
  • ల్యాండ్ పూలింగ్ జీవోను వెనక్కు తీసుకున్నట్టు సీఎం ప్రకటించాలని డిమాండ్

కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న వరంగల్ జిల్లాలో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ రచ్చబండలో ఆయనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తన దృష్టికి వచ్చిన రెండు అంశాలపై లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్న రైతుల వెతలపై లేఖ రాశారు. 

జయశంకర్ సార్ స్వగ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలకు ఆ గ్రామం నోచుకోవడం లేదని, పరిస్థితులు అధ్వానంగా మారాయని అన్నారు. ఇప్పటికీ ఆ గ్రామానికి రెవెన్యూ గ్రామం హోదా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టే తెలంగాణ ఉద్యమ రూపకర్త అయిన జయశంకర్ సార్ పై మీకు ఎంత విద్వేషం, వ్యతిరేక భావం ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. అధికార మదంతో జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పుట్టిన ఊరికి కూడా గుర్తింపు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లిస్తున్నామంటూ చెప్పుకోవడం కాదని, అక్కంపేటలో ఏ ఇంటికీ నల్లా నీళ్లు రావడం లేదని చెప్పారు. వెంటనే ఆ ఊరికి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. 

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కోసం కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణకు సిద్ధమైందని విమర్శించారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ, అభివృద్ధి పేరిట పచ్చని పొలాల్లో చిచ్చు మాత్రం పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఉన్న 21,517 ఎకరాల భూములను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఫలితంగా లక్ష మందికిపైగా రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులోనూ ఎక్కువగా రెండు మూడెకరాలున్న బక్క రైతులే ఉన్నారని, ఆ భూమి ఉంటేనే వారికి ఆదాయమని అన్నారు. ఇప్పుడు భూమిని గుంజుకుని నోటి కాడి కూడును లాక్కుంటే వాళ్లెలా బతుకుతారని ప్రశ్నించారు. 

వారు మళ్లీ కూలీలుగా బతకాల్సి వస్తుందని, అలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని రేవంత్ అన్నారు. రైతుల జీవితాలను నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భూసమీకరణ నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి రైతులు దినదినగండంగా బతుకుతున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ జీవోను వెనక్కు తీసుకుంటున్నట్టు కింది స్థాయి నేతలు చెబుతున్నా రైతులకు నమ్మకం కలగడం లేదని, కాబట్టి సీఎం హోదాలో కేసీఆరే ఆ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News