Ranil Wickremesinghe: శ్రీలంకలో ఇక ఒక్క రోజుకు సరిపడా పెట్రోల్ మాత్రమే మిగిలుంది: నూతన ప్రధాని విక్రమ సింఘే

Ranil Wickremesinghe speech

  • శ్రీలంకలో నానాటికీ క్షీణిస్తున్న పరిస్థితులు
  • అడుగంటిన విదేశీ మారకద్రవ్య నిల్వలు
  • ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని
  • త్యాగాలు చేయాలని, సవాళ్లు ఎదుర్కోవాలని సూచన

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో ఎంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో ఆ దేశ నూతన ప్రధాని ప్రసంగం కళ్లకు కట్టింది. ఇటీవల మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయగా, రణిల్ విక్రమసింఘే కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకున్నారు. ఆయన ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఇంకొక్క రోజుకు సరిపడా మాత్రమే పెట్రోల్ నిల్వలు మిగిలున్నాయని వెల్లడించారు.  

భారత్ రుణ ప్రాతిపదికన పంపిస్తున్న పెట్రోల్, డీజిల్ ఆ తర్వాత కొన్నిరోజుల పాటు శ్రీలంకకు దిక్కు అని పేర్కొన్నారు. దేశంలో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు విక్రమసింఘే కొన్ని పరిష్కార మార్గాలను ప్రస్తావించారు. రానున్న రెండు నెలలు ప్రజా జీవనం దృష్ట్యా ఎంతో కీలకమని, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. 

త్వరలోనే దేశ వార్షిక బడ్జెట్ ను ఉపశమన బడ్జెట్ తో భర్తీ చేస్తామని చెప్పారు. తన ఈ ప్రయత్నం ఏ ఒక్య వ్యక్తినో, గ్రూప్ నో, కుటుంబాన్నో కాపాడడం కోసం కాదని, సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంకను గట్టెక్కించడమే తన లక్ష్యమని ప్రధాని రణిల్ విక్రమసింఘే ఉద్ఘాటించారు.

విక్రమసింఘే ప్రసంగం ముఖ్య వివరాలు...

* కొద్ది వ్యవధిలోనే ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం రూ.2.3 ట్రిలియన్లు (శ్రీలంక రూపాయలు) మేర బడ్జెట్ ఆదాయాన్ని ఆశించినా, వాస్తవానికి రూ.1.6 ట్రిలియన్లు (శ్రీలంక రూపాయలు) ఆదాయం మాత్రమే లభించింది. 

* ప్రభుత్వ వ్యయం రూ.3.3 ట్రిలియన్లు (శ్రీలంక రూపాయలు) కాగా, వడ్డీ రేట్ల పెరుగుదల, పాత ప్రభుత్వ అదనపు ఖర్చులతో వెరసి మొత్తం వ్యయం రూ.4 ట్రిలియన్లు (శ్రీలంక రూపాయలు) అయింది.  ఈ ఏడాది బడ్జెట్ లోటు రూ.2.4 ట్రిలియన్లు (శ్రీలంక రూపాయలు). శ్రీలంక జీడీపీలో 13 శాతానికి ఇది సమానం.

* 2019 నవంబరులో విదేశీ మారకద్రవ్య నిల్వలు 7.5 బిలియన్ డాలర్లు. ఇవాళ దేశ ఖజానాలో 1 మిలియన్ డాలర్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. దేశంలో గ్యాస్ దిగుమతి కోసం 5 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చుకునేందుకు దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అష్టకష్టాలు పడుతోంది. 

* దేశంలో 14 రకాల ముఖ్యమైన ఔషధాలకు కొరత నెలకొని ఉంది. ఔషధాల కొనుగోలు కోసం అత్యవసరంగా చెల్లింపులు చేయాల్సి ఉంది. 

* తీవ్ర నష్టాల్లో నడుస్తున్న శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించాలి.

* దేశంలో ఇకపై 15 గంటల పాటు విద్యుత్ కోతలు తప్పనిసరి.

Ranil Wickremesinghe
Prime Minister
Sri Lanka
Crisis
  • Loading...

More Telugu News