YS Vivekananda Reddy: నాకు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత?... వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి ఆందోళన
![ys vivekananda reddy murder case approver dastagiri comments on his security](https://imgd.ap7am.com/thumbnail/cr-20220423tn6263c57a4e27b.jpg)
- లోకల్ పోలీసులతో సెక్యూరిటీ
- ఇష్టమొచ్చినప్పుడు వచ్చి వెళుతున్నారు
- అడిగితే సీబీఐ ఎస్సీకి చెప్పుకోమంటున్నారన్న దస్తగిరి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తన భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ అధికారుల సిఫారసు మేరకు కోర్టు తనకు పోలీసు సెక్యూరిటీ కల్పించమని ఆదేశించినా, తన ఇంటివద్ద మాత్రం ఎవరూ కాపలా ఉండడం లేదని అన్నారు.
ఈ మేరకు శనివారం నాడు తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన దస్తగిరి.. "నాకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వడం లేదు. నా సెక్యూరిటీ కోసం లోకల్ పోలీసులను ఇచ్చారు. ఆ లోకల్ పోలీసులు వారికి ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు. వెళుతున్నారు. ఏమైనా అడిగితే మా పరిధి దాటి రాలేమని చెబుతున్నారు. ఈ చిన్న పాటి విషయాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పుకోమని సలహా ఇస్తున్నారు. నాకు ఎక్కడ సెక్యూరిటీ ఇచ్చారో చెప్పాలి. నాకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?" అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.