BJP: ధాన్యం కొనుగోళ్లకు కేసీఆర్ సర్కారు సహకరించట్లేదు: కేంద్ర మంత్రి గోయల్
![piyush goyal comments on purchage of raw rice from telangana](https://imgd.ap7am.com/thumbnail/cr-20220321tn62385674a8f6c.jpg)
- ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ రచ్చ
- తెలంగాణ నుంచి రా రైస్ కొంటామన్న గోయల్
- కేసీఆర్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణ
తెలంగాణలో ఇప్పుడు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై రాజకీయ రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ పట్టుబడుతున్నారు. ఈ దిశగా ఆయన తన పార్టీ నేతలతో కీలక సమావేశం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఢిల్లీలోనూ బీజేపీ తెలంగాణ నేతలు తమదైన శైలి విమర్శలు సంధిస్తున్నారు.
సోమవారం పార్లమెంటులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కలిశారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన బండి.. తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపైనే చర్చించారు. ఈ సందర్భంగా స్పందించిన గోయల్.. యాసంగి సీజన్ లో కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.