Rajasingh: ఎల్లారెడ్డిపేట బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrests BJP MLA Rajasingh

  • ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ 
  • గాయపడిన బీజేపీ నాయకులు
  • పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్
  • హైదరాబాదులోనే అడ్డుకున్న పోలీసులు
  • బీజేపీ శ్రేణులకు మంత్రి గంగుల వార్నింగ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిన్న రాత్రి జరిగిన ఓ ఘటనతో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. మరికొందరు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేట బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. గాయపడిన బీజేపీ నాయకులను పరామర్శించాలని భావించారు. అయితే, ఆయనను హైదరాబాదులోనే అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా, ఎల్లారెడ్డిపేట ఘటనపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్ ఎల్లారెడ్డిపేటలో తోట ఆగయ్య ఇంటికి వెళ్లారు. 

బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయని, అందుకే చాలామంది బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. ఆ ఉక్రోషంతోనే బీజేపీ శ్రేణులు తమవారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యూపీ, బీహార్, గుజరాత్ సంస్కృతిని పాటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తపై చేయి పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. దాడులతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు.

Rajasingh
BJP
Ellareddypet
Police
TRS
Rajanna Sircilla District
  • Loading...

More Telugu News