bellamkonda: 'నా పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారు.. వ‌దిలిపెట్ట‌ను' అంటూ నిర్మాత బెల్లంకొండ వార్నింగ్.. వీడియో ఇదిగో

bellam konda warns sharan

  • సురేశ్ ‌మోసం చేశారంటూ శరణ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు 
  • శరణ్ పై పరువు నష్టం దావా వేస్తాన‌న్న ‌బెల్లంకొండ 
  • త‌న‌ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కుట్ర అని ఆరోప‌ణ‌
  • త‌న కుమారుడి ఇమేజ్ పాడు చేయ‌డానికి య‌త్న‌మ‌ని ఆగ్ర‌హం

ప్ర‌ముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ‌మోసం చేశారంటూ హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన శరణ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు చీటింగ్ కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. గ‌తంలో సినిమా నిర్మాణం కోసం త‌న వ‌ద్ద రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని శ‌ర‌ణ్ ఆరోపించారు. 

దీనిపై బెల్లంకొండ సురేశ్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ప‌రువు తీయ‌డానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నార‌ని అన్నారు. త‌న‌ పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారని ఆయ‌న అన్నారు. శరణ్ పై పరువు నష్టం దావా వేస్తాన‌ని, లీగల్ గా ఎదుర్కొంటాన‌ని చెప్పారు. 'వాడిని వ‌దిలేది లేదం'టూ హెచ్చ‌రించారు. 

త‌న‌ను, త‌న‌ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగంగానే త‌న‌పై కేసు నమోదు చేశార‌ని ఆరోపించారు. శరణ్‌ ద‌గ్గ‌ర ఏవైనా ఆధారాలు ఉంటే పోలీసుల‌కు స‌మ‌ర్పిస్తే త‌న‌ను పిలిచి వివ‌ర‌ణ అడిగేవార‌ని, ఆ త‌ర్వాత కేసు న‌మోదు చేసేవారని చెప్పారు. త‌నకు శ‌ర‌ణ్ ఎన్న‌డూ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదని తెలిపారు. 

త‌న‌కు డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు ఆధారాలు ఉంటే పోలీసుల‌కు అంద‌జేయాల‌ని చెప్పారు. ఇప్పుడు శరణ్ త‌న కుమారుడి జోలికి వ‌చ్చాడ‌ని, బాధ‌తో ఈ విష‌యం చెబుతున్నాన‌ని అన్నారు. పిల్ల‌ల జోలికి రావ‌డం ఏంట‌ని అన్నారు. త‌న కుమారుడు సినీ రంగంలో దేశంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడ‌ని, అత‌డి ఇమేజ్ పాడు చేయ‌డానికి అత‌డి పేరును కూడా వాడుతున్నార‌ని అన్నారు. 

అంద‌రూ ఓ విష‌యం అర్థం చేసుకోవాల‌ని చెప్పారు. త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి నోటీసులు రాలేద‌ని వివ‌రించారు. సెల‌బ్రిటీలు, హీరోల‌పై శ‌ర‌ణ్‌ లాంటి వారు ఇటువంటి ప‌నులు చేస్తూ పోతే తాము అంద‌రం ఇబ్బందుల్లో ప‌డ‌తామ‌ని అన్నారు. అందుకే అత‌డిపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు. తాము ఎవ్వ‌రిజోలికీ వెళ్ల‌బోమ‌ని చెప్పారు. శరణ్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారని ఆరోపించారు. త‌మ‌ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడుతున్నార‌ని చెప్పారు.  


        

  • Loading...

More Telugu News