Mother: ఆస్తులు లాక్కుని అమెరికా పారిపోయిన కుమారుడు.. ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన తల్లి

Mother Sits On Fast Unto Death As Son Escapes With All Assets To USA

  • డబ్బు, పలుకుబడితో తప్పించుకుంటున్నాడన్న తల్లి
  • ఎన్ని కేసులు పెట్టినా ఫలితం లేదని ఆవేదన
  • కృష్ణా జిల్లాలో ఘటన.. గోడ చుట్టూ పోస్టర్లు పెట్టిన తల్లి

కొడుకు పట్టించుకోవడం లేదని అతడి ఇంటి ముందే ఆమరణ నిరాహార దీక్షకు దిగింది ఓ తల్లి. తన భర్త చనిపోయాక ఆస్తినంతా లాక్కుని అమెరికా వెళ్లిపోయాడని, అప్పట్నుంచి తనను పట్టించుకోవడం లేదని ఆ తల్లి మనోవేదనను అనుభవిస్తోంది. ఈ ఘటన కృష్ణా జిల్లా పరిధిలో జరిగింది. 

తనకు న్యాయం చేయాలంటూ పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సత్యనాగకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. చావనైనా చస్తానుగానీ న్యాయం జరిగేవరకు పోరాడుతానని చెప్పారు. స్పందనలో ఎన్నోసార్లు తన సమస్యపై మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదన్నారు. 

ఇంటి చుట్టూ ఆమె గోడకు పోస్టర్లు అంటించి అధికారుల తీరుపైనా నిరసన వ్యక్తం చేశారు. తన భర్త 2001లో కారు ప్రమాదంలో చనిపోయారని, తండ్రి చేసిన అప్పులు తీర్చకుండా ఆస్తులు లాగేసుకుని తన కుమారుడు గరిమెళ్ల వెంకటఫణీంద్ర చౌదరి అమెరికాకు పారిపోయాడని ఆమె ఆ పోస్టర్లలో తెలియజేశారు. తన ఆస్తిని లాక్కుని రోడ్డున పడేశాడంటూ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. 

ఎన్ని కేసులు పెట్టినా డబ్బు, రాజకీయ పలుకుబడితో తన కుమారుడు తప్పించుకుంటున్నాడని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడి అడ్రస్సు, ఫోన్ నంబర్ లేకుండా ఎలా తీర్పులు చెప్పారంటూ ఆఫీసర్లను ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు.

  • Loading...

More Telugu News