జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పలేదు: బొత్స సత్యనారాయణ
- రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు
- అనుమానాలుంటే గ్రామాల్లోకి వెళ్దాం రండి
- జగనన్న ఇళ్ల నిర్మాణంలో రాజీ పడకూడదని జగన్ చెప్పారు
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న వైయస్ వివేకా హత్యకేసులో కూడా రాద్ధాంతం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. హత్యకు సంబంధం లేని పేర్ల గురించి మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసమే చెత్తపై రోజుకు రూపాయి, రెండ్రూపాయలు వసూలు చేస్తున్నామని... కానీ, ప్రజలను దోచుకుతింటున్నట్టు కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని బొత్స అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటి స్థలం, నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం కొన్ని మాటలు మాట్లాడితే తప్పులేదని... కానీ ఉన్నవి, లేనివి మాట్లాడటం సరికాదని అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో రాజీ పడకూడదని జగన్ చెప్పారని తెలిపారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, ఏదోఒకలా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పీఆర్సీ విషయంలో కూడా ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు భావించారని... కానీ ఉద్యోగులు వారి తప్పును తెలుసుకున్నారని అన్నారు.