Chandrababu: టీడీపీ అధిష్ఠానం నుంచి గంటా శ్రీనివాసరావుకు పిలుపు.. త్వరలోనే వచ్చి కలుస్తానన్న మాజీ మంత్రి

Chandra babu calls Ganta Srinivasa rao

  • పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో నేడు చంద్రబాబు సమావేశం
  • గత కొంతకాలంగా పార్టీకి దూరంగా గంటా
  • చంద్రబాబు పిలుపుతో చర్చనీయాంశం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖపట్టణం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో సమావేశం కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మొత్తం 12 మందితో అధినేత సమావేశమవుతారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా ఆ జిల్లా లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఇన్‌చార్జ్ పల్లా శ్రీనివాస్, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తదితరులకు అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. అయితే, ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో తాను త్వరలోనే వచ్చి కలుస్తానని పార్టీ కార్యాలయానికి గంటా సమాచారం అందించారు.

అలాగే, చంద్రబాబుతో సమావేశానికి రావాల్సిందిగా విజయనగరం జిల్లా బొబ్బిలి ఇన్‌చార్జ్ బేబినాయన, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఇన్‌చార్జ్ పెందుర్తి వెంకటేశ్ తదితరులకు కూడా వర్తమానం అందింది. కాగా, గంటా శ్రీనివాసరావు ఇటీవల పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడిన మరుక్షణం తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ప్రస్తుతం ఆయన రాజీనామా లేఖ స్పీకర్ వద్ద ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి గంటాకు పిలుపురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Chandrababu
Telugudesam
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News