Revanth Reddy: అది మీకు వెన్నతో పెట్టిన విద్యే కదా.. ఎమ్మెల్సీ కవితకు రేవంత్ కౌంటర్

Revanth Counter Tweet For Kavaita

  • మొసలి కన్నీళ్లు కార్చడంలో దిట్ట
  • తెలంగాణ తల్లిని ప్రధాని అవమానించారు
  • మీ నేత ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ కామెంట్
  • మాణికం ఠాగూర్ కు కౌంటర్ గా కవిత ట్వీట్
  • ఆ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన రేవంత్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్, కవిత మధ్య ట్విట్టర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. యువత, సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పోరాడుతుందని మాణికం ఠాగూర్ నిన్న ట్వీట్ చేశారు. ఈ ఏడేండ్లలో ప్రజలు కోరుకున్న తెలంగాణ సాకారం కాలేదన్నారు. అలాంటి తెలంగాణ రావాలంటే ఊసరవెల్లి టీఆర్ఎస్ను, మతపిచ్చి బీజేపీని ఓడించాలని ఆయన సూచించారు.

అయితే, ఆయన ట్వీట్ పై స్పందించిన కవిత.. తెలంగాణ ఏమీ గిఫ్ట్ కాదని, కేసీఆర్, టీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన ఉద్యమం వల్లే రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. ‘‘మీ మాజీ ప్రధానిని, మీ పార్టీ నాయకత్వాన్ని బీజేపీ అవమానిస్తే టీఆర్ఎస్ అండగా నిలిచింది. దేశంలో రాజకీయాల్లో గౌరవం నింపేలా రాజీకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ స్పందించారు’’ అని ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు.

కవిత ట్వీట్ కు రేవంత్ తాజాగా స్పందించారు. మొసలి కన్నీళ్లు కార్చడం మీ పార్టీ నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్యే కదా అంటూ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘తెలంగాణ తల్లి’ని, అమరుల బలిదానాలను అవమానించినప్పుడు మీ నేత ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రజలు టీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నారని అన్నారు. #NeverTrustKCR (కేసీఆర్ ను అస్సలు నమ్మరాదు) అనే హాష్ ట్యాగ్ ను ఆయన జత చేశారు.

Revanth Reddy
TPCC President
K Kavitha
TRS
  • Loading...

More Telugu News