America: అమెరికాలో రోజుకు 3 వేల మంది మృతి.. కొవిడ్ ఆంక్షలు సడలిస్తున్న ఫిన్లాండ్

US logs over 3000 daily Covid deaths

  • అమెరికాలో మునుపటి పరిస్థితులు
  • ఫిబ్రవరి నుంచి ఆంక్షలు ఎత్తేస్తున్న ఫిన్లాండ్
  • ఫైజర్ పిల్ 'పాక్స్‌లోవిడ్‌'కు ఈయూ అనుమతి
  • పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన ఈయూ దేశాలు

అమెరికాలో కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతోంది. అక్కడ రోజుకు 3000 మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్ మరణాలు, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచీ ఎక్కువగా నష్టపోయింది అమెరికానే అని చెప్పాలి. ఇప్పటివరకు ఆ దేశంలో ఈ వైరస్ కారణంగా 8,70,00 మృతి చెందినట్టు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలోనే కరోనా మృతుల విషయంలో ఇది అత్యధికమని చెప్పాలి.

మరోవైపు, ఫిన్లాండ్‌లో కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొవిడ్ ఆంక్షలను క్రమంగా సడలించాలని నిర్ణయించినట్టు ఆ దేశ ప్రధాని సన్నా మారిన్ తెలిపారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లపై భారం తగ్గుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి హన్నా సర్కినెన్ పేర్కొన్నారు.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో రెస్టారెంట్లపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 6 గంటలకే రెస్టారెంట్లు మూతపడుతుండగా, ఇకపై ఈ సమయాన్ని 9 గంటలకు పెంచాలని నిర్ణయించినట్టు సర్కినెన్ తెలిపారు. అలాగే, ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు వంటి సాంస్కృతిక, క్రీడా వేదికలను తిరిగి తెరవడానికి స్థానిక అధికారులు అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదిలావుంచితే, కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి వరకు టీకా అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఫైజర్ సంస్థ చికిత్సలో భాగంగా ఓ పిల్‌ను తీసుకొచ్చింది. దీని వినియోగానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ నిన్న షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'పాక్స్‌లోవిడ్' పేరుతో ఫైజర్ తీసుకొచ్చిన ఈ పిల్ ‌ను ఐరోపా దేశాలైన ఇటలీ, జర్మనీ, బెల్జియం వంటివి ఇప్పటికే కొనుగోలు చేశాయి. అమెరికా గత డిసెంబరులోనే పాక్స్‌‌లోవిడ్, మెర్క్స్ తీసుకొచ్చిన ఇలాంటి ఔషధమే అయిన మోల్నుపిరావిర్‌కు అనుమతినిచ్చింది.

America
EU
COVID19
Paxlovid
Molnupiravir
  • Loading...

More Telugu News