Lata Mangeshkar: లతా మంగేష్కర్ కు వెంటిలేటర్ తొలగించే ప్రయత్నాలు చేస్తున్న వైద్యులు

Lata Mangeshkar continues in ICU

  • లతా మంగేష్కర్ కు కరోనా
  • ఈ నెల 8న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిక
  • అప్పటినుంచి ఐసీయూలో చికిత్స
  • కొద్దిగా కోలుకుంటున్నారన్న వైద్యులు

కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. అయితే, ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు.

ప్రస్తుతం లతా మంగేష్కర్ కొద్దిగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం గమనిస్తోందని తెలిపారు. లతా మంగేష్కర్ కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ, ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కరోనా పాజిటివ్ రావడంతో లతా మంగేష్కర్ ఈ నెల 8న ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఓసారి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రచారం జరిగినా, ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. అప్పటి నుంచి ఆసుపత్రి వర్గాలు క్రమం తప్పకుండా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నాయి.

Lata Mangeshkar
ICU
Ventilator
Breach Candy Hospital
Corona Virus
Mumbai
  • Loading...

More Telugu News