FCRA: భారత్ వేలాది ఎన్జీవోలకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ లు నిలిపివేయడాన్ని ఖండించిన బ్రిటన్ పార్లమెంటు

Britain decides to talk Indian govt over FCRA issue

  • భారత్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేల ఎన్జీవోలు
  • 6 వేల ఎన్జీవోలకు ఎఫ్ సీఆర్ఏ నిలిపివేత
  • ఆగిపోనున్న విదేశీ నిధులు
  • భారత్ తో చర్చిస్తామన్న బ్రిటన్ మంత్రి

స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్జీవో) తమ సేవా కార్యక్రమాల కోసం విదేశాల నుంచి నిధులు అందుకోవడం పరిపాటి. అందుకోసం ఎన్జీవోలు కేంద్రం నుంచి ఎఫ్ సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అయితే, ఈ ఏడాది ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 6 వేల ఎన్జీవోలకు విఘాతంలా పరిణమించింది. ఆయా ఎన్జీవోల ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ ను కేంద్రం తొలగించింది.

జనవరి 1వ తేదీ ముందు వరకు దేశంలో 22,762 ఎన్జీవోలు ఎఫ్ సీఆర్ఏ కింద నమోదై ఉన్నాయి. అయితే, ఇప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ ఉన్న ఎన్జీవోల సంఖ్య 16,829గా పేర్కొన్నారు

ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ కోల్పోయిన సంస్థల్లో జామియా మిలియా ఇస్లామియా, ఆక్స్ ఫామ్ లే కాదు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా ఉంది. ఇటీవలే కేంద్రం మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థకు కూడా ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ పొడిగింపునకు తిరస్కరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటులో అసంతృప్తి సెగలు రేగాయి. ఎన్జీవోల పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరి పట్ల బ్రిటన్ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ దక్షిణాసియా వ్యవహారాల మంత్రి లార్డ్ అహ్మద్ స్పందిస్తూ, లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంతో ఈ వ్యవహారాన్ని నిర్మాణాత్మక పద్ధతిలో చర్చిస్తామని వెల్లడించారు. అటు, భారత కేంద్ర ప్రభుత్వంతోనూ నేరుగా సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు.

కాగా, మదర్ థెరెస్సా చారిటీస్ ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ ను కేంద్రం పొడిగించకపోవడం పట్ల ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగానే లైసెన్స్ పునరుద్ధరణను నిరాకరించారని తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ నిర్ణయం స్వచ్ఛంద సేవాసంస్థల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News