Agni-P: అత్యాధునిక అగ్ని-పి అణు క్షిపణి పరీక్ష విజయవంతం

DRDO successfully test fires Agni P nuclear missile

  • ఒడిశాలోని కలాం దీవి నుంచి అగ్ని-పి ప్రయోగం
  • సంతృప్తి వ్యక్తం చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు
  • అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నట్టు గుర్తింపు
  • డీఆర్డీవో శాస్త్రజ్ఞులను అభినందించిన రాజ్ నాథ్ సింగ్

భారత అమ్ములపొదిలో చేరేందుకు మరో పదునైన అస్త్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) నేడు అత్యాధునిక అగ్ని-పి బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

అగ్ని-పి (అగ్ని-ప్రైమ్) మిస్సైల్ ను ముందుతరం క్షిపణిగా డీఆర్డీవో అభివర్ణిస్తోంది. అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సత్తా దీని సొంతం. దీని రేంజి 1000 నుంచి 2000 కిలోమీటర్లు. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి ఈ ఉదయం 11.06 గంటలకు గాల్లోకి దూసుకుపోయిన అగ్ని-పి పరీక్ష పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.

తూర్పు తీర ప్రాంతం పొడవునా ఏర్పాటు చేసిన వివిధ టెలీమెట్రీ వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రోల ఆప్టికల్ కేంద్రాలు, యుద్ధ నౌకల సాయంతో ఈ మిసైల్ గమనాన్ని డీఆర్డీవో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. ఇందులోని కీలక వ్యవస్థల పనితీరు అంచనాలకు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. అగ్ని-పి రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. దీంట్లో డ్యూయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు పొందుపరిచారు. తాజా పరీక్ష ద్వారా ఇందులోని సాంకేతిక వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది.

అగ్ని-పి పరీక్ష విజయవంతం కావడంతో డీఆర్డీవో శాస్త్రవేత్తలను దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

  • Loading...

More Telugu News