Telangana: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్.. తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు!

51 percent students failed in Inter first year exams

  • ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం మంది ఫెయిల్
  • ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్ల భర్తీలో ఇంటర్ మార్కులకు వెయిటేజి
  • విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్న ఫస్టియర్ మార్కులు

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. ఈ పరీక్షల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. వీరిలో కూడా చాలా మంది బోర్డర్ మార్కులతో బయటపడ్డారు. ఈసారి ఒక్కరు కూడా 100 శాతం మార్కులు సాధించలేకపోవడం గమనార్హం.

వీరంతా ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో వీరికి ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. అయితే, పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో వీరికి పరీక్షలను నిర్వహించారు. ఫస్టియర్ పరీక్షలు ఉండవనే యోచనలో ఉన్న విద్యార్థులు ఫస్టియర్ ను పక్కన పెట్టేసి, సెకండియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలాంటి సమయంలో పరీక్షలను నిర్వహించడంతో... విద్యార్థుల పరిస్థితి తారుమారైంది. దీంతోపాటు ఆన్ లైన్ విద్యాబోధన కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

మరోవైపు వీరికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీనికి సంబంధించి విద్యాశాఖ నుంచి కానీ, ఇంటర్ బోర్డు నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ... ఇంటర్ సెకండ్ ఇయర్ తో పాటు ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన సబ్జెక్టుల పరీక్షలను కూడా రాయాల్సి ఉంటుంది.

వాస్తవానికి ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్న సమయంలో కరోనా వచ్చింది. దీంతో లాక్ డౌన్లు, ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. చాలా మంది విద్యార్థుల వద్ద సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవడం ఆవేదన కలిగించే విషయం.

ప్రతి విద్యార్థికి ఇంటర్ మార్కులు చాలా కీలకం. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లను భర్తీ చేసే క్రమంలో ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ మార్కులు విద్యార్థుల భవిష్యత్తుపై నెగెటివ్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News