Tollywood: తుస్సుమన్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తు.. కేసును మూసేయాలని ఈడీ నిర్ణయం!

ED decided to close tollywood Drugs Case

  • 2017లో కేసు నమోదు చేసిన ఆబ్కారీశాఖ
  • టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం
  • సుదీర్ఘంగా సాగిన దర్యాప్తు
  • పలువురు నటీనటులను విచారించిన ఈడీ
  • ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తునకు స్వస్తి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో దర్యాప్తు కొండెక్కినట్టేనని తెలుస్తోంది. డ్రగ్స్ దిగుమతి, నిధుల మళ్లింపు వంటివాటిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులో సరైన ఆధారాలు లభించకపోవడంతో ఇప్పుడీ కేసుకు మంగళం పాడాలని ఈడీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అప్పట్లో కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో పలువురు ప్రముఖ నటీనటులను విచారించారు. వీరిలో కొందరి నుంచి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపారు. కొందరు సాక్షులను కూడా విచారించారు. అయితే, ఇన్నిచేసినా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఆబ్కారీ దర్యాప్తు ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆగస్టులో ఈడీ అధికారులు కొత్తగా మళ్లీ కేసు నమోదు చేయడంతో మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ, రానా, చార్మి, రకుల్‌ప్రీత్ సింగ్ తదితర 12 మందిని విచారించారు.  ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారించారు. అయితే, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో చివరికి కేసును మూసేయాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tollywood
Drugs Case
ED
Telangana
  • Loading...

More Telugu News