Venkaiah Naidu: రోశ‌య్య మృతి ప‌ట్ల‌ ప్ర‌ముఖుల దిగ్భ్రాంతి

venkaiah expresses condolences

  • రోశ‌య్య‌ అనుభవం రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది: వెంక‌య్యనాయుడు
  • రోశ‌య్య ప‌లు ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చారు: కేసీఆర్
  • రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: జ‌గ‌న్
  • రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చంద్ర‌బాబు

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది' అని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్యనాయుడు ట్వీట్ చేశారు.

'ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా శ్రీ రోశయ్య గారు అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని వెంక‌య్యనాయుడు అన్నారు.
 
రోశ‌య్య ప‌లు ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. సౌమ్యుడిగా, స‌హ‌న శీలిగా త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శించార‌ని తెలిపారు. రోశయ్య కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేశారు.

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ట్వీట్ చేశారు.

'సౌమ్యుడిగా, నిరాడంబరునిగా పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ చిత్తశుద్ధితో,  ప్రజలకు సేవలందించిన రోశయ్యగారి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు. రోశయ్యగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చంద్ర‌బాబునాయుడు అన్నారు.

రోశ‌య్య మృతి ప‌ట్ల టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత తుల‌సిరెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. రోశ‌య్య కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు.  

'మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సమున్నత వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం కలిగి, విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

'ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడుగా రాజకీయరంగ ప్రవేశం చేసి, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ వంటి కీలక పదవులను నిర్వహించి, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న కొణిజేటి రోశయ్య గారి మరణం విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి' అని బీజేపీ నేత సుజ‌నా చౌద‌రి సానుభూతి వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News