Shilpa Chowdary: శిల్పా చౌదరిని విచారించిన నార్సింగి పోలీసులు

Police questions Shilpa Chowdary

  • పోలీసుల అదుపులో శిల్పా చౌదరి
  • సెలబ్రిటీలకే టోకరా
  • శిల్ప చేతిలో నష్టపోయామంటున్న మహేశ్ బాబు సోదరి
  • తాజాగా యువ హీరో హర్ష సైతం అదేమాట

టాలీవుడ్ సెలబ్రిటీలకే కుచ్చుటోపీ పెట్టిన శిల్పా చౌదరిని పోలీసులు నేడు విచారించారు. శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. శిల్పా చౌదరి రూ.2.90 కోట్ల మేర టోకరా వేసిందని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, యువ హీరో హర్ష కూడా పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. తాను రూ.3 కోట్లు నష్టపోయినట్టు హర్ష పేర్కొంటున్నాడు. క్రమం తప్పకుండా సెలబ్రిటీలకు పార్టీలు ఇస్తూ వారిని ఇట్టే ఆకట్టుకోవడంలో శిల్పా దిట్ట అని తాజా పరిణామాలతో వెల్లడైంది. కాగా, శిల్పా చౌదరిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు నేడు 6 గంటల పాటు విచారించారు.

శిల్ప బినామీలు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఇతర ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు. తనపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించి ఆమె స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. కోట్లాది రూపాయలను ఎక్కడికి తరలించారన్న కోణంలో విచారణ సాగింది. అంతేకాదు, శిల్పా చౌదరి కాల్ డేటాలోని కొందరు వ్యక్తులను కూడా పోలీసులు సంప్రదించినట్టు తెలుస్తోంది.

తొలుత వివరాలు చెప్పేందుకు ససేమిరా అన్న శిల్పా చౌదరి... పోలీసులు ఆధారాలు ముందుంచడంతో నోరువిప్పినట్టు సమాచారం. తనకు డబ్బు ఇచ్చిన వారు చాలామంది అప్పుగా ఇచ్చారని, మరికొందరు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ఇచ్చారని సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం... ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేసింది.

Shilpa Chowdary
Police
Cheating
Tollywood
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News