Andhra Pradesh: ఇవాళ ఏపీలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం.. వాతావరణ కేంద్రం

Thunder Storms Likely In AP Today

  • ఐదు రోజుల పాటు తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • 48 గంటల పాటు మోస్తరు వానలు
  • బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం
  • అలుగు పారుతున్న చెరువులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ భారత దేశం అతలాకుతలమవుతోంది. ఏపీలో వర్ష బీభత్సం నుంచి జనాలు ఇంకా తేరుకోలేదు. తిరుపతిలోని రాయల చెరువు ఎప్పుడు తెగేది తెలియట్లేదు. అయితే, ఇవాళ ఏపీలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం సూచించింది. ఇటు తమిళనాడు వ్యాప్తంగా ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్ణాటకకూ భారీ వర్ష సూచన ఉన్నట్టు చెప్పింది.

ఇప్పటికే నిన్న కురిసిన వర్షానికి సిలికాన్ వ్యాలీ బెంగళూరు మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లలో చిక్కుకుంది. 27 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎలహంక చెరువు పరిసరాలన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. సింగపుర, ఆమనికెరె, అల్లాల్ సంద్ర చెరువులు నిండిపోయి అలుగుపారుతున్నాయి. కోగిలు క్రాస్, నాగవర, విద్యారణ్యపుర, ఎలహంకలు మునిగిపోయాయి. ఇప్పటికే జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయి.


తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈ శుక్రవారం (నవంబర్ 26న) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే 48 గంటలు ఉరుములతో కూడిన జల్లులు, కొన్నిచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోడ్, సేలం, నమక్కల్, కల్లాకురిచి, పెరంబళూరుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తిరునల్వేలి, తూత్తుకుడి, మదురై, రామనాథపురం జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది. తీర ప్రాంత జిల్లాల్లో బుధ, గురువారాల్లో భారీ వానలు పడే అవకాశముందని తెలిపింది.

 

Andhra Pradesh
Tamilnadu
Karnataka
Rain
IMD
Weather Forecast
  • Loading...

More Telugu News