YS Sharmila: చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారు: షర్మిల

YS Sharmila fires on KCR

  • రైతులు చనిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదు
  • రైతుకు మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
  • వడ్లు ఎందుకు కొనడం లేదో కేసీఆర్ చెప్పాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. రైతులు చనిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదని అన్నారు. పంట పండించడం వరకే రైతు పని అని... వారికి మద్దతు ధరను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేసీఆర్ చేసిన ప్రకటనను నిరసిస్తూ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ఈరోజు ఆమె దీక్షను చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటున్నాయని... టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కొనడం లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ. 300 ఎక్కువ ఇచ్చి సన్న బియ్యాన్ని కొన్నారని షర్మిల అన్నారు. కనీస మద్దతు ధరను వెంటనే ప్రకటించి కొనకపోతే రైతులను ప్రభుత్వం మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సివిల్ సప్లైస్ ఆడిట్ రిపోర్టును బయటపెట్టాలని... అప్పుడు రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు ఇస్తోందో వెల్లడవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News