Lakireddy Bali Reddy: ప్రవాసాంధ్రుడు లకిరెడ్డి బాలిరెడ్డి అమెరికాలో కన్నుమూత

Lakireddy Bali Reddy no more dies in America

  • ఈ నెల 13న స్వగ్రామం వెల్వడంకు పార్థివ దేహం
  • 14న అంత్యక్రియలు
  • విద్యావేత్తగా, సామాజికవేత్తగా గుర్తింపు
  • జీవితంలో మాయని మచ్చగా నకిలీ వీసా, లైంగిక వేధింపుల ఆరోపణలు
  • మరణవార్తతో వెల్వడంలో విషాదం

ప్రముఖ ప్రవాసాంధ్రుడు, లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడు లకిరెడ్డి బాలిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తెల్లవారుజామున అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి స్వస్థలం కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నెల 13న ఆయన పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి 14న అంత్యక్రియలు నిర్వహిస్తారు.

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన లకిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చేశారు. వర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1960లో అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. అనంతరం అక్కడే ఉద్యోగంలో చేరారు.

అమెరికాలో స్థిరపడిన ఆయన దాదాపు 300 మందిని అమెరికాకు తీసుకెళ్లి తాను ప్రారంభించిన రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఉపాధి కల్పించారు.1997లో లకిరెడ్డి బాలిరెడ్డి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఓ సేవా సంస్థను స్థాపించారు. దేవాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు నిర్మించారు. ఆయన నాయనమ్మ పాపులమ్మ పేరుతో హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్ కట్టించారు. వెల్వడం అడ్డరోడ్డులో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందించారు.  

ఇప్పటికీ ప్రతినెలా వందలాదిమందికి పెన్షన్లు అందిస్తున్నారు. చదువులో రాణించే పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సాయం అందిస్తున్నారు. రూ. 100 కోట్లతో 65 ఎకరాల సువిశాల ప్రదేశంలో లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల స్థాపించారు. ఇన్ని చేసిన ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, నకిలీ వీసాల ఆరోపణలు ఆయనను చుట్టుముట్టాయి. ఈ కేసుల్లో 2000వ సంవత్సరంలో అమెరికా న్యాయస్థానం ఆయనకు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Lakireddy Bali Reddy
Krishna District
America
Passed Away
  • Loading...

More Telugu News