Mallu Bhatti Vikramarka: దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి... శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే: భట్టి

Bhatti says Congress party will be eternal

  • కొంపల్లిలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు
  • కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి వ్యాఖ్యలు
  • కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ లను ఓడించాలని పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి... కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఉద్ఘాటించారు.

కాంగ్రెస్ పై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా సరిపోరని భట్టి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి పదవి తన ముందు నిలిచినా వద్దనుకున్న త్యాగమూర్తి సోనియా గాంధీ అని వివరించారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, గాంధేయవాదమే కాంగ్రెస్ భావజాలమని స్పష్టం చేశారు.

దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో చిక్కుకుందని, దేశాన్ని ఓవైపు బీజేపీ పట్టిపీడిస్తుంటే, మరోవైపు రాష్ట్రాన్ని టీఆర్ఎస్ దోచుకుంటోందని అన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News