Kishan Reddy: నాలుక‌లు చీల్చుతామ‌ని అంటే భ‌య‌పడిపోతామా?: కేసీఆర్ హెచ్చ‌రిక‌ల‌పై కిష‌న్ రెడ్డి మండిపాటు

kishan reddy slams kcr

  • పెట్రోల్ ధ‌ర‌ల విష‌యంలో అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌కూడ‌దు
  • రాష్ట్రంలో ధ‌ర‌లు త‌గ్గించాలి
  • మా కుటుంబాల‌కు ఫాంహౌసులు లేవు
  • ఢిల్లీలో ధ‌ర్నా చేస్తామ‌ని అంటున్నారు
  • తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డ‌బోం

కేంద్ర ప్ర‌భుత్వంపైనా, రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పైనా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చారు. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌తి సంవ‌త్స‌రం ధాన్యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తోంద‌ని అన్నారు. ధాన్యం సేక‌ర‌ణ‌కు కేంద్ర స‌ర్కారు రూ.26,640 కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని చెప్పారు.

2014లో ధాన్యం సేకరణకు ఉన్న మొత్తాన్ని రూ.3,400 కోట్ల నుంచి రూ.26,640 కోట్లకు పెంచామ‌ని తెలిపారు. ఇప్ప‌టికీ ముడి బియ్యాన్ని కేంద్ర స‌ర్కారు కొనుగోలు చేస్తోంద‌ని చెప్పారు. అన్ని విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేలా కేసీఆర్ మాట్లాడ‌డం సరికాద‌ని చెప్పారు.

అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు పెర‌గ‌క‌పోయిన‌ప్ప‌టికీ భార‌త్‌లో ఎన్డీఏ స‌ర్కారు పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేస్తోంద‌ని కేసీఆర్ నిందలు వేస్తున్నారని, అయితే అంత‌ర్జాతీయంగా పెర‌గ‌క‌పోతే మ‌న దేశంలో ధ‌ర‌లు పెంచాల్సిన అవ‌స‌రం కేంద్ర స‌ర్కారుకి లేద‌ని ఆయ‌న అన్నారు.

త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పెట్రోలు ధ‌ర‌లు పెంచార‌ని తెలిపారు. ఇప్పుడు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ధ‌ర‌లు త‌గ్గించింద‌ని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోలు, డీజిలు ధ‌ర‌ల‌ను త‌గ్గించాయ‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లోనూ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా ఏ చార్జీలు పెంచ‌డం లేద‌ని చెప్పారు. వ్యాక్సిన్లు కూడా ఉచితంగా ఇస్తోంద‌ని తెలిపారు.

పెట్రోల్ ధ‌ర‌ల విష‌యంలో అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు పెరిగితేనే దేశంలో పెట్రోలు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా ఆలోచించి ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా రాష్ట్రంలో ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం దోచుకుంటోంద‌ని అంటున్నార‌ని, ఆ అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని మంత్రి స్పష్టం చేశారు.

త‌మ కుటుంబాల‌కు ఏం ఫాంహౌసులు లేవ‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం తామేం రూ.350 కోట్లు ఖ‌ర్చుచేయ‌లేద‌ని అన్నారు. ఢిల్లీలో ధ‌ర్నా చేస్తామ‌ని అంటున్నార‌ని, నాలుక‌లు చీల్చుతామ‌ని అంటున్నారని, అయితే ఈ తాటాకు చ‌ప్పుళ్ల‌కు తాము భ‌య‌ప‌డ‌బోమ‌ని చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో దేశంలో 80 కోట్ల మందికి ఏడాదిన్న‌ర పాటు ఉచిత బియ్యం అందించామ‌ని కిషన్ రెడ్డి చెప్పారు.  

  • Loading...

More Telugu News