RRR: 'ఆర్ఆర్ఆర్‌'లోని డైలాగును స్వ‌యంగా చెప్పేసిన రాజ‌మౌళి.. వీడియో ఇదిగో

Rajamouli Reveals a Dialogue from RRR

  • ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాజ‌మౌళి
  • సినిమా గురించి మాట్లాడుతూ డైలాగ్
  • హీరోలు పోరాటానికి సిద్ధ‌మ‌వుతోన్న స‌మ‌యంలో ఉండే డైలాగ్‌?

‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మ యుద్ధమైతే’ అంటూ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగును ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బయటపెట్టేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ డైలాగు చెప్పారు.

ఈ సినిమాలో ఈ డైలాగ్‌ ఎవరు ఎవరితో చెబుతార‌న్న విష‌యాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మొద‌టి డైలాగు ఇదేనంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. థియేట‌ర్ల‌లో విజిల్స్ వేయిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.  ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే.  

జ‌న‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో రాజ‌మౌళి ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగానే ఓ కార్య‌క్ర‌మంలో ఈ సినిమా గురించి మాట్లాడారు. కపిల్ దేవ్ క్రికెట్ ఆడిన నాటి రోజులు గుర్తుచేసుకుంటూ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని డైలాగు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ సినిమాలో బ్రిటిష్ వారితో హీరోలు పోరాటానికి సిద్ధ‌మ‌వుతోన్న స‌మ‌యంలో వారి గురువు ఆ డైలాగు చెబుతార‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. రాజ‌మౌళి చెప్పిన డైలాగు సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌రణ్‌తో పాటు అలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్ర ఖని, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.  


                             

  • Loading...

More Telugu News