Andhra Pradesh: నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ గిరిజన మహిళకు వైసీపీ నేత బెదిరింపులు

YCP Leader Intimidated Pregnant ST Woman

  • కాచవరం ఒకటో వార్డుకు శిరీష అనే మహిళ నామినేషన్
  • చామంతుల వెంకన్న అనే వ్యక్తి ఫోన్ చేసి వేధింపులు
  • వెనక్కు తీసుకోకుంటే ఆర్ అండ్ ఆర్ రానివ్వనంటూ హెచ్చరికలు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న ఓ మహిళకు బెదిరింపులు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా కాచవరం పంచాయతీ ఒకటో వార్డుకు నామినేషన్ వేసిన శిరీష అనే గిరిజన మహిళను చామంతుల వెంకన్న అనే వైసీపీ నేత ఫోన్ చేసి బెదిరించాడు. ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అయింది. తనను తాను పార్టీ స్థానిక వైస్ ప్రెసిడెంట్ గా చెప్పుకొన్నాడు.

నామినేషన్ ను ఉప సంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకన్న హెచ్చరించాడు. టీడీపీనే కాదు.. ఏ పార్టీ తరఫునా నామినేషన్ వేయొద్దన్నాడు. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకుండా చేస్తామన్నాడు. ఆర్ అండ్ ఆర్ కు అర్హులు కారంటూ రిపోర్ట్ ఇప్పిస్తానని ఆమెను హెచ్చరించాడు. జడ్పీటీసీని వెంటబెట్టుకుని వెళ్లి.. అసలు అక్కడ ఉండనే ఉండరని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎలా ఇస్తారని ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు.

తాను అల్లాటప్పా మనిషిని కాదని, గ్రామంలో ఎవరుంటున్నారు? ఎవరుండట్లేదు? అన్న డేటా తన దగ్గర ఉంటుందని శిరీషపై బెదిరింపులకు పాల్పడ్డాడు. మీకు ఏదీ రాకుండా అడ్డుకుంటానని, చామంతుల వెంకన్నే చేశాడని చెప్పేలా నేరుగా చేస్తానని హెచ్చరించాడు.

కాగా, ఈనెల 3న నామినేషన్ వేశామని, తమ బంధువులకూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని శిరీష వాపోయారు. తమకో చిన్నబాబున్నాడని, ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ నని, ఇప్పటికే ఎన్నో టెన్షన్ లున్నాయని, వైసీపీ నేతల బెదిరింపులతో టెన్షన్ మరింత ఎక్కువైందని ఆమె చెప్పారు. వైసీపీ నేతలు ఏం చేస్తారోనన్న భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Girijan
Panchayat Elections
YSRCP
  • Loading...

More Telugu News