Cricket: అశ్విన్ ను పదేపదే దూరం పెడుతున్నారెందుకు?.. విచారణ జరిపించాలన్న టీమిండియా మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్

- టీమిండియాది ఇంత చెత్త ప్రదర్శనా?
- ఆటగాళ్లలో ఏ కోశానా ఉత్సాహమే లేదు
- రోహిత్ ను మూడో స్థానంలో దింపడం తప్పు
టీమిండియా ఆట తీరు పట్ల మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ మండిపడ్డారు. జట్టు ప్రదర్శన ఇంత చెత్తగా ఉంటుందని ఊహించలేదన్నారు. ఆటగాళ్లలో ఏ కోశానా ఉత్సాహమన్నదే కనిపించట్లేదని విమర్శించారు. దానికి బయో బబుల్ అలసట కారణమా? లేక మరేదైనానా? అని ఆయన అన్నారు. ఆటగాళ్ల శరీరతత్వం బాగాలేదన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా తేలిపోయిందని వ్యాఖ్యానించారు. మొదటి బంతి నుంచీ పేలవ ప్రదర్శనేనన్నారు.

ఆల్ రౌండర్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదని, రోహిత్ ను మూడో స్థానంలో దింపడం మంచిది కాదని ఆయన అన్నారు. బౌండరీల వద్ద మన బ్యాటర్లు క్యాచ్ అవుటవడం ఆందోళన కలిగించేదేనని, భారత్ లో ఐపీఎల్ నిర్వహిస్తే బౌండరీల దూరం పెంచాలని ఆయన సూచించారు.