Kolkata Knight Riders: ఐపీఎల్ 2021: కోహ్లీ సేన చిత్తు.. కోల్‌కతా ఘన విజయం

KKR restart season with a big win

  • దారుణంగా విఫలమైన బెంగళూరు బ్యాట్స్‌మెన్
  • దేవదత్ పడిక్కల్ చేసిన 22 పరుగులే అత్యధికం
  • వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు

ఐపీఎల్‌లో భాగంగా అబుదాబిలో గతరాత్రి బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. కోహ్లీ సేన నిర్దేశించిన 93 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి సగం ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 48, వెంకటేశ్ అయ్యర్ 41 (నాటౌట్) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 19 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు బెంగళూరు ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. వరుణ్ చక్రవర్తి, రసెల్ పోటీలు పడి వికెట్లు తీశారు. దీంతో బెంగళూరు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఐదు పరుగులు మాత్రమే చేసి కెప్టెన్ కోహ్లీ అవుట్ కాగా, ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ (16) కలిసి కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 31 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. జట్టులో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అంతేకాదు వీరిద్దరు చేసిన పరుగులే అత్యధికం.

ఆదుకుంటారనుకున్న డివిలియర్స్, అరంగేట్ర ఆటగాడు హసరంగా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. మ్యాక్స్‌వెల్ 10, హర్షల్ పటేల్ 12 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ఫెర్గ్యూసన్ 2, ప్రసీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. మూడు వికెట్లు తీసి బెంగళూరు పరాజయాన్ని శాసించిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Kolkata Knight Riders
Royal Challengers Bangalore
IPL 2020
Abu Dhabi
Varun Chakravarthy
  • Loading...

More Telugu News