Somu Veerraju: ఏపీలో ఇది కాదనలేని సత్యం.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనటానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: సోము వీర్రాజు

somu veerraju on elections results

  • ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన కూట‌మి రాణించింది
  • రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొన్నాం
  • మంచి ఫలితాలతో మార్పునకు శ్రీకారం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌మ బీజేపీ-జ‌న‌సేన కూట‌మి రాణించింద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. మార్పు కోసం ప్ర‌జ‌లు త‌మ వైపున‌కే చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొని, మంచి ఫలితాలతో మార్పునకు శ్రీకారం చుట్టిన బీజేపీ, మిత్రపక్షం జ‌న‌సేన పార్టీ నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమిని ఆదరించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు' అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

'అంపశయ్యపై ఉన్న టీడీపీ ఎన్నికలలో పోటీ చేయకుండానే చేతులెత్తేస్తే, అధికార వైసీపీ  అవినీతి సహిత, అభివృద్ధి రహిత పాలన నుండి రాష్ట్ర ప్రజలను రక్షించుకోవాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసినటువంటి అనేక దాడులలో చేతులు విరిగినా, తలలు పగిలినా తట్టుకుని అధికారపార్టీకి దీటుగా బరిలో నిలిచింది ఒక్క బీజేపీ, జ‌న‌సేన  కూటమి మాత్రమే' అని సోము వీర్రాజు చెప్పారు.

'ఇది కాదనలేని సత్యం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనటానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ప్రజలు కోరుకుంటున్న మార్పును బీజేపీ-జనసేన కూటమి క‌చ్చితంగా తీసుకువస్తుంది. అభివృద్ధి చేసి చూపిస్తుంది' అని సోము వీర్రాజు చెప్పారు.

Somu Veerraju
BJP
YSRCP
Janasena
  • Loading...

More Telugu News