KRMB: వాడీవేడిగా కేఆర్ఎంబీ సమావేశం... వాకౌట్ చేసిన తెలంగాణ

Telangana walked out from KRMB meeting

  • తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు
  • సయోధ్య కుదిర్చేందుకు కేఆర్ఎంబీ యత్నం
  • బోర్డు చైర్మన్ అధ్యక్షతన సమావేశం
  • తమ నిర్ణయం వెలిబుచ్చిన కేఆర్ఎంబీ చైర్మన్
  • అసంతృప్తితో వెళ్లిపోయిన తెలంగాణ అధికారులు

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం వాడీవేడిగా సాగింది. హైదరాబాదులోని జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ ఎమ్.పి.సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ ప్రతినిధులు, ఏపీ, తెలంగాణ అధికారులు హాజరైన ఈ కీలక సమావేశం 5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది.

ఏపీ తరఫున నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, నీటిపారుదల శాఖ అంతర్రాష్ట జలవిభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు.

2021-22 ఏడాదికి గాను కృష్ణా జలాలపై నీటి కేటాయింపులపై చర్చ జరగ్గా, ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనలు వారు వినిపించారు. గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చకు తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేఆర్ఎంబీ చైర్మన్ ఎమ్.పి.సింగ్ స్పందించారు. నాగార్జున సాగర్, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది తమకు సమ్మతం కాదంటూ వారు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

ఇటీవల పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ భేటీ ఎట్టకేలకు జరగడంతో, ఇందులో ఏం నిర్ణయిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. తెలంగాణ వాకౌట్ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ నిర్ణయం అమలుపై అనిశ్చితి నెలకొంది. ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల బాధ్యతలను నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించిన సంగతి తెలిసిందే.

KRMB
Meeting
Telangana
Walkout
Andhra Pradesh
  • Loading...

More Telugu News