Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్ పేట బిడ్డనే... కిషన్ రెడ్డి భావోద్వేగం

Kishan Reddy gets emotional at Amberpet

  • కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
  • అంబర్ పేటలో అపూర్వ స్వాగతం
  • ముగ్ధుడైన కిషన్ రెడ్డి
  • ఆనాటి ఆనందం ఇప్పుడు లేదని వ్యాఖ్యలు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాదులోని అంబర్ పేటకు చేరుకుంది. తన పాత నియోజకవర్గం అంబర్ పేటలో అడుగుపెట్టగానే కిషన్ రెడ్డిలో భావోద్వేగాలు పెల్లుబికాయి. అంబర్ పేట రావడం పట్ల ఆయన స్పందిస్తూ, రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్టుగా ఉందని పేర్కొన్నారు. దేశానికి రాజైనా తాను అంబర్ పేట బిడ్డనే అని ఉద్ఘాటించారు. గతంలో ఇక్కడి ప్రజలు తన పట్ల చూపిన ఆదరణ తనను ముగ్ధుడ్ని చేసేదని వ్యాఖ్యానించారు.

"నాడు నేను బస్సుల్లో తిరిగేటప్పుడు ఇక్కడి అమ్మలు, చెల్లెమ్మలు నన్ను సాదరంగా స్వాగతించేవాళ్లు. ఇప్పుడా ఆనందంలేదు. ఇప్పుడు నన్ను కలిసేందుకు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కార్లలో వస్తుంటారు. కానీ, అంబర్ పేటలో ఉండే ఆనందం మాత్రం నాకు రాదు. అయితే, ఇవాళ నాకు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. అందుకు కారణం అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజలే. మీరు, నరేంద్ర మోదీ గారు ఇచ్చిన అవకాశంతోనే నేను ఢిల్లీ వరకు వెళ్లాను. అంబర్ పేట బిడ్డగా మీరు గర్వపడేలా పనిచేస్తా. మీకు మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా.

ఇవాళ నేను మూడు శాఖలకు కేంద్రమంత్రిగా ఉన్నాను. గతంలో అమిత్ షాకు నేను సహాయమంత్రిగా పనిచేశా. కానీ ప్రధాని నరేంద్ర మోదీ... నువ్వు సహాయకుడిగా కాదు, నీకే మూడు శాఖలు ఇస్తున్నానని నన్ను కేంద్రమంత్రిని చేశారు. ఒక సహాయమంత్రిగా ఉన్న నాకు ఇవాళ మోదీ గారు ఐదు సహాయమంత్రులను ఇచ్చారు. దేశంలో అత్యధిక సహాయమంత్రులను కలిగి ఉన్నది మీ అంబర్ పేట్ బిడ్డకే" అంటూ ఉద్వేగంతో ప్రసంగించారు.

కిషన్ రెడ్డి గతంలో అంబర్ పేట నియోజకవర్గం నుంచి 2009, 2014లో అసెంబ్లీకి గెలుపొందారు. అయితే 2018లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ మరుసటి ఏడాదే సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. ఆయన ఇప్పటికీ అంబర్ పేటను తన సొంతగడ్డగానే భావిస్తుంటారు.

  • Loading...

More Telugu News